ముంత ఇచ్చి చెంబు లాక్కుంటున్న జిత్తుల మారి జగన్: అచ్చెన్నాయుడు

  • ఈరోజు 'చేదోడు' పథకాన్ని ప్రారంభించిన జగన్
  • ఇది జగన్ చేతివాటం పథకమని అచ్చెన్న విమర్శ
  • కొంత మందికే సాయం చేస్తున్నారని మండిపాటు
నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఈరోజు  'చేదోడు' పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పారు. మరోవైపు, ఈ పథకంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఇది జగనన్న చేదోడు పథకం కాదని...  జగన్ చేతివాటం పథకమని చెప్పారు.  

సంక్షేమం పేరుతో నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీలను జగన్ మోసం చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఉంటే... కేవలం 38 వేల మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడం ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. 15 లక్షల మంది రజకులు ఉంటే కేవలం 82,347 మందికి సాయం చేయడం మోసం కాదా? అని నిలదీశారు. 13 లక్షల మంది దర్జీలు ఉంటే కేవలం 1,25,926 మందికి మాత్రమే లబ్ధిని చేకూర్చడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. ముంత ఇచ్చి చెంబు లాక్కుంటున్న జిత్తులమారి జగన్ అంటూ దుయ్యబట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించారని అచ్చెన్న విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నుంచి రూ. 3,634 కోట్లను దారి మళ్లించి... బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు.

Kinjarapu Acchamnaidu
Telugudesam
Jagan
YSRCP
Jagananna Chedodu Scheme

More Telugu News